byసూర్య | Mon, Jan 21, 2019, 12:09 PM
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం మెడిపూర్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో నాగర్ కర్నూలు- కల్వకుర్తి ప్రధాన రహదారిపై నీళ్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తులో విరజిమ్ముతూ సినిమా సెట్ ను తలపించాయి. నీరు ఉద్ధృతంగా ఎగిసిపడటంతో రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పైప్ లైన్ ద్వారా ఎల్లూరు నుంచి కల్వకుర్తికి నీటిని తరలిస్తున్నారు. కాగా, అచ్చం సినిమా సెట్ లా నీళ్లు గాల్లోకి విరజిమ్మడంతో స్థానికులు భారీగా ఇక్కడకు చేరుకున్నారు. చాలా మంది యువత పోటీపడి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. చివరికి ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేసేందుకు సిబ్బందిని పంపారు. గతంలో నిర్మల్ జిల్లాలోని మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో 15 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎగిసిపడిన సంగతి తెలిసిందే.