byసూర్య | Sun, Jan 20, 2019, 06:53 PM
రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు.. చాలా మంది సినీ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కొందరు పోలీసు విచారణను కూడా ఎదుర్కొన్నారు. మరికొందరి పేర్లు కూడా పోలీసుల జాబితాలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. అంతలా దుమారం రేపిన ఈ కేసు.. ఒక్కసారిగా చల్లబడిపోయింది. విచారణ నెమ్మదించిపోయింది. ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారం ఊసే లేకుండా పోయింది. దీంతో సినీ పెద్దలు ప్రభుత్వంతో వ్యవహారాన్ని చక్కబెట్టారని, అందుకే కేసు విచారణ అటకెక్కిందనే టాక్ కూడా వినబడింది. అవన్నీ ఎంతవరకు నిజమోగానీ.. తాజాగా ఈ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది.
తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి అసెంబ్లీలో.. డ్రగ్స్ కేసు అంశం చర్చకు వచ్చింది. బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.. ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పట్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు ఏమైందని.. ఆ విచారణ అర్ధారంతరంగా ఎందుకు ఆగిపోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్రికెట్ బెట్టింగ్ను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ధూల్పేటలో సారా తయారీని ఆపేశారని.. వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను చూపాలని కోరారు.ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని.. డాక్టర్లు హెల్మెట్లు రక్షణగా పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొందని అసెంబ్లీలో రాజాసింగ్ చెప్పారు. నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తామన్న హామీ ఏమైందని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కొందరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీతో కలిసి వెళ్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ఎంఐఎంపై పరోక్ష విమర్శలు చేశారు.