byసూర్య | Sun, Jan 20, 2019, 01:18 PM
బెంగళూరు: కర్నాటకం రంజుగా సాగుతోంది. గత ఆరు రోజులుగా బీజేపీ ఎమ్మెల్యేల క్యాంపు ముగిసింది. గత సోమవారం నుంచి కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలు 40 మంది గుర్ గావ్ లోని ఒక రిసార్ట్ లో క్యాంప్ చేసిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కమల్ అమలు కోసం వీరందరినీ గురుగావ్ క్యాంపునకు తరలించారు. అయితే ఆ ఆపరేషన్ సజావుగా ముందుకు సాగకపోవడం, కర్నాటకలో జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణాన్ని కూలదోయడం సాధ్యం కాదన్న విషయం తేటతెల్లం కావడంతో వారందరూ తిరిగి బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఈ మేరకు బెంగళూరు బీజేపీ అధ్యక్షుడు యెడ్యూరప్ప వారిని ఆదేశించారు.
అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజకీయ క్యాంప్ మాత్రం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 75 మంది ఎమ్మెల్యేలు కూడా గత వారం రోజుల నుంచీ రిసార్ట్ లోని క్యాంప్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కమల్ మేరిట రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ భావిస్తున్నది. ఈ నెలాఖరులో కర్నాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యగా క్యాంపును మరో రెండుమూడు రోజులు కొనసాగించాలని భావిస్తున్నది.