byసూర్య | Sun, Jan 20, 2019, 12:41 PM
ప్రజలు కేంద్రంగానే సీఎం కేసీఆర్ పాలన చేశారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. పేదలు, రైతులకు సాయం చేయడం గురించే సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచిస్తారన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు గతంలో ఎవరైనా పింఛన్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందుతోందన్నారు. గురుకులాల ద్వారా ఉచితంగా ఇంగ్లీష్ మీడియం బోధన, పుస్తకాలు, దుస్తులు ఇస్తోన్న ప్రభుత్వం ఇదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు.
మరో మూడు నెలల్లో మిషన్ భగీరథ పూర్తయ్యి ఇంటింటికి మంచినీరు అందుతుందన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇవ్వడం వెనక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ శాఖపై దాదాపు ప్రతిరోజూ సమీక్ష చేసేవారన్నారు. రాష్ట్రంలో 3.50 లక్షల గొల్ల, కురుమల కుటుంబాలకు గొర్రెపిల్లల పంపిణీ జరిగిందన్నారు. సాగుపెట్టుబడి కోసం రైతులు అప్పు చేయకూడదనే సంకల్పంతోనే రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రవేశపెట్టిన రైతుబంధును కేంద్రప్రభుత్వం కూడా అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. రైతుబంధు, రైతుభీమాను దేశంలోని ఆర్థికవేత్తలంతా ప్రశంసించారు. యాభై ఏళ్లలో జరగని కార్యక్రమాలు గత నాలుగేళ్లలో జరిగాయన్నారు.