byసూర్య | Sat, Jan 19, 2019, 12:33 PM
హైదరాబాద్ : హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సును ఇవాళ జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారే కలిసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మనల్ని దేవుడు ఇక్కడికి పంపారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు.