byసూర్య | Sat, Jan 19, 2019, 12:18 PM
మూడో రోజూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం మొదలైన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే మార్చి నాటికి భగీరథ పథకం కింద ఇంటింటికీ మంచి నీరు ఇస్తామన్నారు. మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ స్వయం సమృద్ధి సాధించామన్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, రైతు బంధు పథకం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శమని తెలిపారు. రైతు బీమా రైతు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తోందన్నారు. భూముల రిజిస్ట్రేషన్లో నూటికి నూరు శాతం పారదర్శకత పాటిస్తున్నామన్నారు. కుల వృత్తుల వారికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని, పరిశ్రమలు, ఐటీ రంగ విస్తరణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.