byసూర్య | Fri, Jan 18, 2019, 12:39 PM
హైదరాబాద్ : రైతుల అభివృద్ధి విషయంలో పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన కృషి మరవలేనిది అని మాజీ మంత్రి, హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలుపుతూ సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోసం పోయినప్పుడు ఉప్ప ఎన్నికల్లో శ్రీనివాస్రెడ్డితో కలిసి పని చేశాను. ఆ సందర్భంగా మీ చిత్తశుద్ది, పని విధానం, ప్రజలతో పెనవేసుకున్న బంధమేందో అర్థమైంది. మీ జీవితాన్ని తాము స్ఫూర్తిగా తీసుకున్నాం. ఉద్యమ సమయంలో గొప్పపాత్ర పోషించారు. దేశంలో ధనికుడైన రైతు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారని చెప్పేందుకు పోచారం శ్రీనివాస్రెడ్డి పునాది వేశారు. వ్యవసాయమంటే దండుగ కాదు.. పండుగ అని నిరూపించిన విషయంలో పోచారం కృషి మరువలేనిది అని ప్రశంసించారు.
మా రైతాంగానికి మీ బ్యాంకర్లు సహకరించడం లేదని ముక్కుసూటిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్యాంకర్ల సమావేశంలో అడిగేవారు. రుణాల విషయంలో మీకు సహకరిస్తామని పోచారం శ్రీనివాస్ రెడ్డికి బ్యాంకర్లు చెప్పేవారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. రైతులు పండించిన పంటను కొని రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం మనది. తెలంగాణ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కేవలం రైతాంగం ద్వారానే సాధ్యమైంది. రైతుల విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అమలు చేసి రైతుల హృదయాల్లో చోటు సంపాదించేందుకు ఎంతో కృషి చేశారు. 40 ఏండ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ సభను స్ఫూర్తిదాయకంగా పోచారం శ్రీనివాస్రెడ్డి నడుపుతారని ఆశిస్తున్నాను అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.