byసూర్య | Fri, Jan 18, 2019, 12:00 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ పనులను ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ నేడు పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగెడ్డ చేరుకున్న ఆమె అక్కడ జరుగుతున్న పనులతోపాటు అన్నారం బ్యారేజీ, కన్నేపల్లి పంప్హౌస్ పనుల ప్రగతిని తెలుసుకున్నారు. మ్యాపులు, ఫొటోల ద్వారా అధికారులు పనుల ప్రగతిని వివరించగా రోజుకి ఎంతమేర కాంక్రీట్ పనులు జరుగుతున్నాయని ఆరాతీశారు. అనుబంధ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పోచంపల్లి వైపు నిర్మిస్తున్న సైడ్బండ్ ను పరిశీలించి జాప్యంపై ఆరాతీశారు. ఇద్దరు ముగ్గురు ప్రవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణకు సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకు వెళ్లగా వారం రోజుల్లో సమస్య పరిష్కరించి మార్గం సుగమం చేయాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు సూచించారు.
సైడ్బండ్ విషయంలో నిధుల సమస్య ఉందా అని ప్రశ్నించగా నిధుల సమస్యలేదని, వారం రోజుల్లో పనులు వేగవంతం చేస్తామని ఎల్అండ్ టీ సంస్థ పీఎం రామకృష్ణంరాజు తెలిపారు. మేడిగెడ్డ బ్యారేజీలో రోజుకి కనీసం 19 వేల క్యూబిక్ మీటర్ల పని జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఆమె రామకృష్ణంరాజుకు సూచించారు.