byసూర్య | Fri, Jan 18, 2019, 01:37 AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తలసాని శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో మండిపడ్డారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబులా మేము దొంగరాజకీయలు చేయం. ఏపీకి వెళ్లి నేను రాజకీయం చేశానని చంద్రబాబు అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో మీరు చేసింది ఏంటి? కులాల మధ్య చిచ్చు పెడుతోంది మేము కాదు మీరే. ఇప్పుడు ఏపీలో కాని, అప్పుడు ఉమ్మడి ఏపీలో కానీ కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబే. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టింది ఆయనే. చంద్రబాబు మళ్లీ వద్దు అని ఏపీ ప్రజలు నాకు చెప్పారు. ఏపీలో కచ్చితంగా రాజకీయాలు చేస్తాం. మేము చెబితే వినే నాయకులు ఏపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు’ అని మండిపడ్డారు తలసాని.
దేశంలో మంచి పాలన అందించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబుకు వణుకు పుడుతోందని తలసాని స్పష్టం చేశారు. తాము బాబులా చిల్లర రాజకీయాలు చేయబోమని చెప్పారు. చంద్రబాబుకు టైం దగ్గరపడ్డది. ఎన్టీఆర్ అభిమానులే చంద్రబాబును సాగనంపాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బడుగు, బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని తెలిపారు. తాను ఏపీకి వెళ్తే ఆ స్థాయిలో ప్రజాస్పందన ఉంటే.. మా సీఎం కేసీఆర్ వెళ్తే ఏ రేంజ్లో స్పందన ఉంటుందో ఊహించుకోండి అని తలసాని అన్నారు.