byసూర్య | Mon, Jan 14, 2019, 02:22 PM
హైదరాబాద్ : పాతబస్తీలో 16 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై హోంమంత్రి మహముద్ అలీ ఆరా తీశారు. అత్యాచారం ఘటన కేసు వివరాలను పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ను హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేపట్టి, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహముద్ అలీ పోలీసులను ఆదేశించారు.
నగరంలోని కామాటిపురా పోలీస్స్టేషన్ పరిధిలో 16 ఏండ్ల మైనర్ బాలికపై పదకొండు మంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నాలుగేండ్లుగా బెదిరిస్తూ దారుణాన్ని కొనసాగిస్తుండటంతో బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గతనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మురళీధర్నగర్లో నివసించే ఓ మైనర్ బాలికపై.. అదే కాలనీకి చెందిన విజయ్ కన్నేశాడు. చాలారోజులుగా పరిచయమున్న విజయ్ కూల్డ్రింక్ ఇవ్వడంతో తాగింది. కూల్డ్రింక్లో మత్తుమందు కలుపడంతో బాలిక నిద్రలోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడ్డాడు.
లైంగికదాడి దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి విజయ్ తన స్నేహితులకు పంపాడు. వీటిని చూపి భయపెట్టిన యువకుడు రాజేశ్ కూడా బాలికపై లైంగికదాడి జరిపాడు. అనంతరం మరో ఇద్దరు కూడా ఇదే తరహా బెదిరింపులకు పాల్పడి లైంగికదాడికి దిగారు. ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తూ పదకొండు మంది నాలుగేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. చివరకు లైంగికదాడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో శుభం, రాజేశ్, అభిజిత్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.