by సూర్య | Tue, Aug 13, 2019, 08:01 PM
తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనని స్పష్టమవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా.? ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారా.? గతంలో వైఎస్ ఫ్యామిలీతో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నఆయన.. అవకాశం వచ్చినా నాడు రాజకీయాల్లోకి రాలేదు. అయితే ఇటీవల వినాయక్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వినాయక్ తనదైన శైలి ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసే సమయంలో జగన్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించిన వినాయక్.. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం 4 కోట్ల మందిలో సీఎం అయ్యే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు అని జగన్ అన్నారని – ఆ మాటలు తనకు బాగా నచ్చాయని చెప్పుకొచ్చారు.
ఆ మాటల వల్లే దర్శకుడిగా ఉన్న తాను నటుడిగా మారేందుకు జిమ్కు వెళ్తున్నానని వినాయక్ అన్నారు. దీని బట్టి చూస్తుంటే త్వరలోనే వినాయక్ వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొంతమంది నేతలు వైసీపీలోకి చేరతారని చెబుతుంటే.. మరికొందరు సినిమాల్లోనే కొనసాగుతారని అంటున్నారు.