by సూర్య | Mon, Jun 24, 2019, 10:02 PM
ఐక్యత, పారదర్శకత, ప్రజాస్వామ్య పద్ధతుత్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ని నిర్వహిస్తున్నాం’ అన్నారు ‘మా’ అధ్యక్షుడు వి.కె.నరేష్. ఆదివారం హైదరాబాద్లో ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగింది. సలహాదారుగా ప్రముఖ నటుడు కృష్ణంరాజుని ఎన్నుకున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణల మరియు దేవదాస్ కనకాలను 'మా' సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ‘కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యాక వారం రోజుల్లోనే మహిళల కోసం హెల్ప్లైన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా 30 ఫోన్ కాల్స్ వచ్చాయి. కంప్లైంట్ బాక్స్కి కూడా మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలతో మాట్లాడి సంక్షేమ పథకాల్ని సభ్యులకి వర్తింపజేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘మా’ సభ్యత్వ విషయంలోనూ డిస్కౌంట్ల గురించి నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కథానాయకులతో కలసి ప్రజలతో మమేకమై, తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. గతంలో ‘మా’కి ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి సలహాదారులుగా ఉండేవాళ్లు. అలా ఈసారి కృష్ణంరాజుగారిని ఎన్నుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రారంభించిన కేసీఆర్కి, తెలంగాణ ప్రభుత్వానికి ‘మా’ తరఫున అభినందనలు’ అన్నారు. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ ‘మొదట ‘మా’లో చిన్న మనస్పర్థలు ఉండేవి. కానీ సర్వసభ్య సమావేశం ఆరోగ్యకరంగా సాగింద’న్నారు. మా సభ్యులు దేవదాస్ కనకాలను ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ కార్యవర్గ సభ్యులు శివాజీరాజా, రాజీవ్ కనకాల, హేమ, శివబాలాజీ, పరుచూరి బ్రదర్స్, సురేష్ కొండేటి, సుదర్శన్, గౌతంరాజు, కవిత, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.