by సూర్య | Sun, Mar 17, 2019, 02:33 PM
'నా ఛానల్ నా ఇష్టం' అంటూ మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజులుగా వరుస పొలిటికల్ సెటైరిక్ వీడియోలు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వదులుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సోదరుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి ప్రజల్లో మద్దతు పెంచేందుకు నాగబాబు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మీడియాను టార్గెట్ చేస్తూ నాగబాబు ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. అవినీతికి అలవాటు పడిన కొన్ని మీడియా సంస్థలు గడ్డి తినడానికి కూడా వెనకాడటం లేదనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో నాగబాబు భగవాన్ శ్రీశ్రీశ్రీ బాబా మహరాజ్ పాత్రలో కనిపించారు.నీతివంతమైన మీడియా కన్నయ్య పాత్రలో జబర్దస్త్ కమెడియన్స్ అదిరే అభి... అవినీతి మీడియా గన్నయ్య పాత్రలో రాము అనే మరో నటుడు నటించారు. ‘ఏం గన్నయ్యా... నువ్వు ఇలా గడ్డి తింటుంటే నీ వృత్తిలో ఉండేవారంతా గడ్డి తినేవారే అని జనాలు అనుకోరా? అందుకే కన్నయ్య బాధ పడుతున్నారు.'' అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.
గన్నయ్య పాత్ర మాట్లాడుతూ... ఒక రోజు నేను ఫ్యాన్ కింద కూర్చుని పచ్చగడ్డి తిన్నాను. ఆ రోజు నుంచి నాకు రూమ్ అంతా పచ్చగడ్డే కనిపిస్తోంది. ఆ టేస్టును మరిచిపోలేక ఎక్కడ గడ్డి దొరికితే అక్కడకికి సైకిల్ వేసుకుని మరీ వెళుతున్నాను. కడుపు నిండా గడ్డి తింటున్నాను... అంటూ ఈ స్కిట్లో డైలాగులు పేల్చారు.నువ్వు గడ్డి తింటూ గొడ్డు నోటికాడ కూడు లాగేసుకుంటున్నావు, అది తప్పు అని నీ మనసు నీకు చెప్పలేదా గన్నయ్య... అంటూ అవినీతి మీడియా వారు మారండి అంటూ నాగబాబు హితోపదేశం చేసే ప్రయత్నం చేశారు.
మీడియాపై సెటైర్లు వేస్తూ... జనాలు నిజం తెలిసిన తర్వాత మీ దుంప తెంచేస్తారు అంటూ రూపొందించిన పాట సైతం ఈ స్కిట్లో ఉంది. సత్యాన్ని పాతేసి నిత్యం వ్యక్తిత్వ హత్యలు చేస్తున్నారు, అమ్మను సొమ్ముకై అమ్ముకుంటే జనులు దుమ్ము దులిపేస్తారంటూ నాగబాబు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
Latest News