by సూర్య | Thu, Mar 14, 2019, 12:33 PM
ఒక్కసారిగా ఆ ఇండస్ట్రీ ప్రమాణాల్ని అమాంతం పెంచేసిింది ‘కేజీఎఫ్’. వంద కోట్ల గ్రాస్ కూడా కలగానే ఉన్న ఇండస్ట్రీలో దాదాపు రూ.250 కోట్ల గ్రాస్ సినిమా రావడమంటే మాటలు కాదు. కన్నడలో మాత్రమే ఈ సినిమా విజయవంతం అయితే పెద్ద విషయం కాదు. కానీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ‘కేజీఎఫ్’ భారీ విజయం సాధించింది.
కన్నడలో గత ఇండస్ట్రీ హిట్ వసూళ్ల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేయడం విశేషం. ‘కేజీఎఫ్’ తొలి భాగం విడుదలయ్యే ముందే దీనికి మరో భాగం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి కొంత చిత్రీకరణ కూడా జరిగింది. ఇప్పుడు సెకండ్ ఛాప్టర్ షూటింగ్ మొదలుపెట్టారు. ‘కేజీఎఫ్-ఛాప్టర్ 1’ మొదలైనపుడు దాన్ని కన్నడ జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సెకండ్ ఛాప్టర్ మొదలవుతుంటే దేశమంతా దాని మీద దృష్టిపెట్టింది.
కేజీఎఫ్ రెండోో ఛాప్టర్లో బాలీవుడ్ నుంచి ఫలానా నటీనటులు కనిపిస్తారని ఇటీవల రకరకాల వార్తలొచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం ఇందులో దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ కీలక పాత్ర చేయనున్నాడట. రెండో భాగానికి వివిధ భాషల నుంచి పెద్ద నిర్మాతలు సపోర్ట్ ఇస్తున్నారు. తొలి భాగం హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి ఈసారి పూర్తి స్థాయిలో సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రితేశ్ సిధ్వానీ కూడా ఇందులో పెట్టుబడి పెడుతున్నాడు.
‘కేజీఎఫ్’ రెండో ఛాప్టర్కు కూడా ప్రశాంత్ నీలే దర్శకుడు. మొదటి భాగంలో కథానాయికగా నటించిన శ్రీనిధి శెట్టి ఇందులోనూ యశ్కు జోడీగా నటించనుంది. మొదటి భాగంలో కంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ను మరింతగా ఇందులో ఎలివేట్ చేస్తారని సమాచారం. రెండో భాగం మీద భారీగా అంచనాలున్న నేపథ్యంలో వాటిని అందుకోవడానికి చిత్ర బృందం చాలా కష్టపడాల్సిందే.