by సూర్య | Tue, Mar 12, 2019, 03:58 PM
అందరూ సినీ నటి కరీనా కపూర్లా అందంగా ఉండలేరు కదా.. అంటూ తనపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై మండిపడుతున్నారు సినీ నటి సమీరారెడ్డి. తెలుగులో ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘అశోక్’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సమీరా 2014లో అక్షయ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. వీరిద్దరికీ ఓ కుమారుడు. పెళ్లయ్యాక సమీర సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఆమె తన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్నారు. త్వరలో సమీర మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా తన మొదటి కుమారుడితో కలిసి దిగిన ఫొటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
అయితే.. సమీర మునుపటిలా లేరని, చాలా లావైపోయి అందవిహీనంగా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు ఆమె ఫొటోపై కామెంట్లు చేస్తున్నారు. దాంతో సమీర మీడియా ద్వారా కామెంట్లపై స్పందిస్తూ నెటిజన్ల నోరుమూయించారు. ‘వివాహమై, పిల్లల్ని కన్న తర్వాత కూడా కొందరు కరీనా కపూర్లా చాలా అందంగా మెరిసిపోతుంటారు. మరికొందరు నాలా సన్నబడటానికి కాస్త సమయం తీసుకుంటారు. అందరూ కరీనాలా ఉండాలనిలేదు కదా..? ఆడవాళ్లను బాడీషేమింగ్ (శరీరాకృతి గురించి కామెంట్లు చేయడం) చేయడం సిగ్గుచేటు. నాపై కామెంట్లు చేస్తున్నవారిని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీరు పుట్టాక మీ అమ్మ అందంగానే ఉందా? ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తల్లికాక తప్పదు. అమ్మ అని పిలిపించుకోవడం ఎంతో అందమైన అనుభూతి. నాకు కొడుకు పుట్టాక బరువు తగ్గడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నేను మళ్లీ తల్లిని కాబోతున్నాను కాబట్టి లావు తగ్గడానికి మరింత సమయం పట్టొచ్చు. కానీ మన శరీరం ఎలా ఉన్నా దానిని స్వీకరించడం ఎంతో అవసరం’ అన్నారు సమీర.
Latest News