by సూర్య | Sun, Oct 24, 2021, 11:44 AM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప` రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని `పుష్ఫ- ది రైజింగ్`గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ద్వితీయార్థం సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అలాగే మొదటి భాగం రిలీజ్ నేపథ్యంలో ప్రచారం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే రెండు సింగిల్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `దాక్కో దాక్కో మేక` అంటూ సాగే మాస్ సాంగ్ కి శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది. సాంగ్ లోనే బన్నీరగ్గడ్ లుక్ ని హైలైట్ చేసారు. ఈ పాటని ఒక్కో భాషలో ఒక్కో సింగర్ ఆలపించారు.
తెలుగులో శివమ్.. హిందీ.. కన్నడం..మలయాళం..తమిళ్ లో విశాల్ దద్లానీ.. విజయ్ ప్రకాష్.. రాహుల్ నంబీయర్.. బెన్నీ గాత్రం అందించారు. అటుపై రెండవ సింగిల్ `శ్రీవల్లి` అంటూ సాగే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటని తమిళ్..తెలుగు..మలయాళం వెర్షన్లకు సిధ్ శ్రీరామ్ గాత్రం అందించగా..హిందీ వెర్షన్ లో జావెద్ అలీ ఆలపించారు. ఈ రెండు పాటలకు శ్రోతల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా యూనిట్ మూడవ పాటని కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఈ పాట సినిమాకి సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.
పాట పూర్తిగా జానపద బాణీతో అలరిస్తుందని సమాచారం. టాలీవుడ్ ఫేమస్ సింగర మంగ్లీ ఈ పాటను ఆలపిస్తారని తెలుస్తోంది. జానపద నేపథ్యం ఉన్న పాటలు పాడటంలో మంగ్లీ ఫేమస్. మంగ్లీ వాయిస్ ఈ పాటకు పర్పెక్ట్ గా సూటయిందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ చక్కని ట్యూన్ సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారరట. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News