by సూర్య | Fri, Oct 22, 2021, 01:07 PM
క్రూజ్ నౌకలో డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా పలువురు అరెస్టయి జైలులో ఉండగా.. తాజాగా ఓ బాలీవుడ్ నటి ఎన్సీబీ ముందు విచారణకు హాజరయ్యారు. బాలీవుడ్ యువ నటి అనన్య పాండే గురువారం మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆమె నివాసంలో సోదాలు జరిపిన అధికారులు.. ఆమె మొబైల్ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణకు రావాలని సమన్లు జారీచేయడంతో తన తండ్రి చుంకీ పాండేతో కలిసి అనన్య ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. డ్రగ్స్ వ్యవహారం, ఆర్యన్తో స్నేహానికి సంబంధించి అనన్యను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహా పలువురు అధికారులు విచారించనున్నారు.క్రూజ్ నౌక రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్లో అనన్య పేరు బహిర్గతమైనట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ అధికారులు ఆమె నివాసంలో తనిఖీలు చేసి విచారణకు రావాలని కోరారు. షారుక్ కుమార్తె సుహానా, అనన్య మంచి స్నేహితులు. మరోవైపు, క్రూజ్ నౌక డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్కు ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నిన్న బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఆయన డ్రగ్స్ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగానే కనబడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీంతో ముంబయి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆర్యన్ మొబైల్ ఫోన్లో వాట్సాప్ చాట్ ఆధారంగా మరో ఇద్దరు బాలీవుడ్ తారలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ముబయిలోని నాలుగు చోట్ల ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు.
Latest News