by సూర్య | Fri, Oct 22, 2021, 11:20 AM
కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం నిర్వహించిన కోడిగుడ్ల టాస్క్ మరోరోజు కూడా కొనసాగింది. 'మిసెస్ ప్రభావతి'(కోడిపేరు) ఎప్పుడు గుడ్లు పెడుతుందా అని ఇంటి సభ్యులు ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మానస్కు ఎరుపు రంగు గుడ్డు లభించింది. దీనిని ఉపయోగించి ఐదు గుడ్లు పొందాలంటే.. ఇంటి సభ్యుల నుంచి ఎవరినైనా ఒకర్ని ఎంపిక చేసుకుని వాళ్లతో కలిసి స్పైసీ నూడుల్స్ తినాలని బిగ్బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో మానస్.. సన్నీని ఎంచుకుని 'స్పైసీ నూడుల్స్' పోటీలో పాల్గొన్నాడు. అయితే మానస్ కంటే సన్నీ కొంచెం ఎక్కువ తిని ఐదు కోడిగుడ్లు సొంతం చేసుకున్నాడు.
కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన 'బంగారు కోడిపెట్ట' టాస్క్ ముగిసిందని బిగ్బాస్ ప్రకటించడంతో ఇంటిసభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి దగ్గర ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో లెక్కపెట్టమని బిగ్బాస్ సూచించాడు. కోడిగుడ్లు ఎక్కువగా సేకరించి మానస్, విశ్వ, సన్నీ, జెస్సీ, శ్రీరామ్లు టాప్ ఫైవ్లో నిలిచారు. ఈ సందర్భంగా జెస్సీకి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు బిగ్బాస్ ఇంటి సభ్యులందరికీ చెప్పాడు. సీక్రెట్ టాస్క్లో గెలిచాననే ఆనందంతో ఉన్న జెస్సీకి ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్బాస్. ఇంట్లో ఉన్న ఎవరైనా ముగ్గురు వ్యక్తుల దగ్గర గుడ్లు దొంగించడం లేదా నాశనం చేయాలని చెబితే.. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ల సాయం అడిగినందుకు జెస్సీని బిగ్బాస్ డిస్క్వాలిఫై చేశారు. జెస్సీ ఆడింది సీక్రెట్ టాస్క్ అని తెలిసి.. ప్రియ-ప్రియాంకలు షాక్ అయ్యారు. దీంతో కెప్టెన్సీ పోటీదారుల నుంచి జెస్సీ వెళ్లిపోయి.. ఆయన స్థానంలో రవి వచ్చాడు.
హౌస్లోకి లోబో ఎంట్రీ..:
గత కొన్నిరోజుల నుంచి సీక్రెట్ రూమ్లో ఉన్న లోబో హౌస్లోకి వచ్చాడు. హౌస్లోకి వచ్చేప్పుడు అతడికి.. ఒక బ్లాక్ ఎగ్, ఒక గోల్డెన్ ఎగ్ ఇచ్చి బిగ్బాస్ పంపించాడు. బ్లాక్ ఎగ్ పొందిన వ్యక్తి కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ ఎగ్ పొందిన వ్యక్తి పోటీలోకి వచ్చే అవకాశం పొందుతారు. అలా, శ్రీరామ్ను బ్లాక్ ఎగ్.. కాజల్కు గోల్డెన్ ఎగ్ వరించింది. అయితే, శ్రీరామ్కు బ్లాక్ ఎగ్ ఎందుకు ఇచ్చాడో లోబో చెప్పి ఉంటే బాగుండేది.
షణ్ముఖ్-సిరి-జెస్సీ ఏడుపులు, అలకలు..
సీక్రెట్ టాస్క్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా జెస్సీ విఫలం కావడంతో షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేశాడు. సిరి, జెస్సీ కారణంగా తాను కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని.. వాళ్లిద్దరూ తనకు అన్యాయం చేశారంటూ షణ్ముఖ్ కేకలు వేశాడు. ''మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకుంటే నన్ను బాగా మోసం చేశారు. నేను దేనికి పనికిరాను. నాకు ఆట ఆడటం రాదు. ప్రతివాడితోనూ మాటలు పడాల్సివస్తుంది'' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. సిరి, జెస్సీలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. అందుకు షణ్ముఖ్ ఒప్పుకోలేదు. ఈ ముగ్గురు మధ్య ఎమోషన్స్తోనే ఎపిసోడ్ మలిభాగం నడిచింది. సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన లోబో.. శ్రీరామ్, విశ్వ రవి, అనీలతో ఓ ప్లాన్ వేశాడు. అందరం కలిసి గేమ్ ఆడదామని మనమే టాప్ ఫైవ్లో ఉండాలని రవి అన్నాడు. విశ్వకు కండ బలం, తనకు బుద్ధి బలం, లోబోకు రెండూ ఉన్నాయని.. అందరం కలిసి ఆడితే తప్పకుండా టాప్లో ఉంటామని చెప్పుకొచ్చాడు.
Latest News