by సూర్య | Mon, Apr 12, 2021, 02:04 PM
ఈ మధ్యకాలంలో ఇంట్లో ఉన్న టైమ్ కంటే ఎక్కువగా సూట్కేసులు సర్దుకుని ఊళ్లు తిరుగుతున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పటికే తన చేతిలో ఉన్న ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, ‘కభీ ఈద్.. కభీ దీవాళి’, ‘సర్కస్’ చిత్రాల కోసం ఇటీవల ఎక్కువగా ముంబయ్, హైదరాబాద్ల మధ్య చక్కర్లు కొట్టారీ బ్యూటీ. మొన్నామధ్య విజయ్ సరసన ఓ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేసి, తన ట్రావెల్ డైరీలోకి తమిళనాడును కూడా చేర్చారు పూజ.
తాజాగా విజయ్ సినిమా కోసం జార్జియా వెళ్లనున్నారట పూజ. అక్కడ కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణను కూడా ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ఇదిలా ఉంటే.. మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా పూజ పేరు వినిపిస్తోంది. మరో విశేషం ఏంటంటే... పూజ నటించిన ‘ఆచార్య’ (మే 13), ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ (జూన్ 19), ‘రాధేశ్యామ్’ (జూలై 30) చిత్రాలు ఈ ఏడాదే విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కరోనా ప్రభావంతో ఈ సినిమాలు వాయిదా పడకపోతే ఈ ఇయర్ తెలుగు తెరపై హీరోయిన్గా పూజాదే హవా.
Latest News