by సూర్య | Sat, Apr 10, 2021, 11:09 AM
శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'అపరిచితుడు' ఆయన కెరియర్లోనే ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన నటనలోని వివిధ కోణాలను ఆవిష్కరించిన ఈ సినిమా, నటుడిగా ఆయనను మరోస్థాయికి తీసుకెళ్లింది. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమా తమిళంలోనే కాదు .. తెలుగులోను వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ దర్శక ప్రతిభకి అద్దం పట్టిన ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కన్ను పడిందట. బాలీవుడ్ లో ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆలస్యంగా ఈ సినిమా ఆయన దృష్టిలోపడినా, రీమేక్ ప్రయత్నాలు మాత్రం స్పీడ్ గానే చేస్తున్నాడట. ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని గురించి శంకర్ ను కలవడం .. మాట్లాడటం జరిగిపోయాయని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఎవరనే విషయంలో త్వరలో స్పష్టత రానుంది. ఆ తరువాత 'అపరిచితుడు' ప్రాజెక్టు వేగంగా ముందుకు కదలనుంది.
Latest News