by సూర్య | Mon, Mar 29, 2021, 08:18 AM
కంటికి కనిపించని వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత ఏడాదిగా అతలాకుతలం చేసిన వైరస్.. తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో భయాందోళన కలిగిస్తోంది. కరోనాను అరికట్టేందుకు రాష్ట్రాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం కట్టడిలోకి రావడం లేదు. మళ్లీ కరోనా కలకలం సృష్టించడంతో పలు రంగాల్లో టెన్షన్ మొదలైంది. అందులో సిని పరిశ్రమ కూడా ఒకటి.
భారతీయ సినీ పరిశ్రమ దాదాపు 9 నెలల పాటు షూటింగ్లను నిలిపివేయగా, గత మూడు నెలల నుంచే మళ్లీ పునఃప్రారంభం అయ్యాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గత ఏడాది నిలిచిపోయిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా, క్రేజీ ప్రాజెక్ట్స్ సైతం ముమ్మర షూటింగ్ మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో మళ్లీ ఆందోళనలో పడిపోయింది. వందల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి తెరకెక్కించే ప్రాజెక్టులపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ ఎక్కడ నిలిచిపోతాయోమోనన్న ఆందోళన మొదలైంది. భారీ ప్రాజెక్ట్స్, పాన్ ఇండియా సినిమాలు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యా్ప్తంగా విడుదలవుతుంటాయి. అయితే పలు నగరాలలో సినిమా థియేటర్లు మూత పడగా, మరికొన్ని మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సినిమా షూటింగ్లు, ఇతర షూటింగ్లు ముందుస్తుగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈ జాబితాలో తెలుగు సినిమాలు సైతం ఉన్నాయి.
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన రానా నటించిన అరణ్య సినిమా సౌత్లో విడుదలైన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా హిందీ వర్షెన్ వాయిదా పడింది. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు నార్త్ లో వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం అరణ్య సినిమా మీద పడింది. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో సెకండ్ వేవ్ ఉదృతమవుతున్న క్రమంలో రానున్న సినిమాల భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
వచ్చే రెండు నెలలు చిన్నా, చితకా సినిమాలతో పాటు జులై నుండి పాన్ ఇండియా సినిమాల విడుదల హవా మొదలు కానుంది. ఇందులో కేజేఎఫ్-2, ప్రభాస్ రాధేశ్యాం, అల్లు అర్జున్ పుష్ప, పూరి-విజయ్ లైగర్ తో పాటు ఇండియన్ బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ వరస పెట్టనున్నాయి. రానున్న మూడు, నాలుగు నెలల్లో వైరస్ తీవ్రత పెరగకుండా తగ్గితే తప్ప ఈ సినిమాలకు ఫ్రీడమ్ దొరికే అవకాశం ఉండదు. మరి ఈ మహమ్మారి అదుపులోకి వస్తుందా? లేదా అన్నదే చూడాలి.
Latest News