by సూర్య | Thu, Mar 25, 2021, 03:15 PM
ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అందులోను నటుల్లో డైరెక్షన్ వైపు అడుగులు వేసేవాళ్లు మరీ తక్కువమంది. ఒకవేళ దర్శకత్వం చేపట్టాలనుకున్నా సేఫ్గా ఒక కమర్షియల్ సినిమా తీయడానికి చూస్తారు కానీ దర్శకులుగా మరీ రిస్క్ చేయడానికి చూడరు. కానీ మలయాళ నటుడు మోహన్ లాల్ మాత్రం మెగా ఫోన్ పెట్టి ఒక మెగా మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఆయన 'బరోజ్' అనే సినిమాతో దర్శకుడిగా మారనున్నట్లు ఇంతకుముందు సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమాను అంగరంగ వైభవంగా మొదలుపెట్టాడు లాల్. మమ్ముట్టి, పృథ్వీరాజ్, దిలీప్, ప్రియదర్శన్ లాంటి అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక నిర్వహించిన తీరుతోనే ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అనే విషయం అర్థమైపోయింది.
వాస్కోడిగామా దగ్గర నిధి పరిరక్షకుడిగా ఉన్న బరోజ్ ఆనే చరిత్రకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం. ఇందులో బరోజ్ పాత్ర చేయబోతోంది మోహన్ లాలే. కేరళ-పోర్చుగల్ నేపథ్యంలో కొన్ని వందల కిందటి సంవత్సరాల పరిస్థితుల్లో ఈ కథ నడుస్తుందట. ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు మోహన్ లాల్. రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని త్రీడీలో తీయబోతుండటం విశేషం.
Latest News