by సూర్య | Tue, Jan 12, 2021, 02:12 PM
రామ్ గోపాల్ వర్మ కెరీర్లో విజయాల కంటే వివాదాలు, విమర్శలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఈయనపై మరో వివాదం చెలరేగింది. తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్లకు కోటి రూపాయల మేర డబ్బులు చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కోపగించుకున్న FWICE (ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయూస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆర్జీవీతో పని చేయకూడదని వాళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కాలంలోనూ వర్మ వరస సినిమాలు చేసాడు. ఈయన నుంచి నాలుగైదు సినిమాలు వచ్చాయి. అలా ఆ సినిమాల కోసం పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పాటు మరికొందరికి అసలు జీతాలే ఇవ్వలేదని ఇప్పుడు తెలుస్తుంది.
ఇవన్నీ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటాయని.. వాళ్లకు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా తిరుగుతున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగా వాళ్లకు డబ్బులు చెల్లించమని కోరుతూ ఫెడరేషన్ వర్మకు సెప్టెంబర్ 17 నుంచి లేఖలు పంపుతూనే ఉంది. దీనిపై కూడా వర్మ పెద్దగా స్పందించలేదు. లీగల్ నోటీసులు సైతం పంపించినా ఆర్జీవీ పట్టనట్లే ఉండిపోయాడు. సెప్టెంబర్లో వర్మ గోవాలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడన్న విషయం తెలిసి అక్కడి ముఖ్యమంత్రికి సైతం లేఖ రాసామని ఎఫ్డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. కరోనా కాలంలో చాలామంది పేద ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేయించుకుని వాళ్లకు డబ్బులివ్వకుండా తిరగడం వర్మకు మంచిది కాదని.. అలాంటి వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించాలని వాళ్లు కోరుతున్నారు.