by సూర్య | Sat, Jan 09, 2021, 05:06 PM
కర్ణాటక మాజీసీఎం కుమారస్వామి సతీమణి, హీరోయిన్ రాధికా కుమారస్వామి వివాదంలో ఇరుక్కున్నారు. కుట్టి రాధికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ తొలి సినిమా నుంచే సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఖాతా నుంచి పెద్దమొత్తంలో రాధిక కుమార స్వామి అకౌంట్ కి భారీ మెుత్తంలో నగదు బదిలీ అయినట్టు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.
దీంతో ఆమెను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. దీంతో ఆమె క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసుల ఎదుట శుక్రవారం హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితుడు అకౌంట్ నుంచి నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు. ఓ సినిమాకు సంబంధించి తన బ్యాంక్ అకౌంట్లో 60 లక్షల రూపాయలు జమ అయినట్లు రాధిక తెలిపారు. అయితే మూవీ యూనిట్ లో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు వెల్లడించారు.
ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానని రాధిక కుమారస్వామి స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యువరాజ్ అలియాస్ స్వామి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చెప్పుకుంటూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి కొంత మంది యువకుల వద్ద లక్షల రూపాయలు కాజేసిన ఆరోపణల నేపథ్యంలో సీసీబీ పోలీసులు గతేడాది డిసెంబర్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో యువరాజ్ బ్యాంక్ ఖాతా నుంచి 60 లక్షల రూపాలయలు రాధికా కుమారస్వామి ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించారు.