by సూర్య | Sat, Jan 09, 2021, 02:38 PM
రియల్ హీరో సోనూసూద్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వెండితెరపై విలన్ గా నటించిన ఆయన రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్లో ఎంతోమందికి ఆశ్రయం కల్పించి దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సోనూ సూద్ పై కేసు నమోదు అయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ పై లీగల్ కేసు పెట్టింది. జూహూ ప్రాంతంలో శక్తి సాగర్ అనే పేరుతో సోనూ సూద్కి ఆరు అంతస్తుల భవనం ఉంది. నివాస భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సోనూ సూద్ హోటల్గా మార్చారని ఆరోపిస్తూ మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను సోనూ సూద్ ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే బీఎంసీ తనపై చేసిన ఆరోపణల్ని సోనూసూద్ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైందని ఒకవేళ అనుమతులు రాకపోతే దాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తామని వివరణ ఇచ్చారు. అయితే ఇది లీగల్ ఇష్యూ కావడంతో.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు.