by సూర్య | Tue, Jan 05, 2021, 03:56 PM
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సైతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం సీటింగ్ నిబంధన కారణంగా థియేటర్ల ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని, అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ, సగం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలు నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోందని వివరించింది. ఖర్చులు రాకపోగా థియేటర్ల యాజమాన్యాలు నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ అంశంపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
దయచేసి 50 శాతం సీటింగ్ నుంచి 100 శాతం సీటింగ్ తో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం వల్ల థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కోలుకుంటాయని, థియేటర్లు, మల్టీప్లెక్సుల నిర్వహణకు తగిన ఆదాయం పొందుతాయని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తన లేఖలో వివరించింది.