by సూర్య | Fri, Oct 09, 2020, 03:37 PM
`కితకితలు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది హీరోయిన్ మధుశాలిని. ఇటీవల `గూఢచారి`తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు వెబ్సిరీస్ల్లోనూ నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన `ఎక్స్పైరీ డేట్` వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో `జీ5` వేదికగా విడుదలయింది. ఈ సందర్భంగా మధుశాలిని వెబినార్ ద్వారా ముచ్చటించింది.
``ఎక్స్పైరీ డేట్` నా తొలి వెబ్ సిరీస్. చాలా కొత్త అనుభవం. సినిమాలకు, సిరీస్లకు తేడా ఉంది. సినిమాలు కంఫర్ట్ జోన్లో చేస్తాం. సినిమాలు హీరో, హీరోయిన్, విలన్ నేపథ్యంలోనే ఎక్కువగా ఉంటాయి. కానీ, వెబ్ సిరీస్లో అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉంటుంది. రెండు గంటల్లోనే మొత్తం చూపించాలనే తొందర ఉండదు.
ఈ వెబ్ సిరీస్లో నా క్యారెక్టర్ పేరు సునీత. సమాజానికి భయపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. డైరెక్టర్ శంకర్ స్టోరీ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే నాకు నిజ జీవితంలో అలాంటి భయం లేదు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సంసిద్ధమయ్యాను. ఇలాంటి పాత్రలున్న సినిమాలు, సిరీస్లు చూసి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇక, వెబ్ సిరీస్ చేస్తే సినిమా అవకశాలు రావేమో అనే భయం లేదు. హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది వెబ్ సిరీస్లు చేశారు. వెబ్ సిరీస్ల ద్వారా వేరే భాషల వారికి, వేరే దేశాల వారికి కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది.
టాలీవుడ్లో మిగిలిన వారితో పోల్చుకుంటే నేను వెబ్ సిరీస్లకు చాలా తొందరగా వచ్చాను. వెబ్ సిరీస్ల పట్ల చాలా తక్కువ మంది తెలుగు నటులు ఆసక్తి చూపుతున్నారు. అయితే పరిస్థితి క్రమంగా మారుతుంది. నా మొదటి సినిమా `కితకితలు` టైమ్కి, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మార్పులను మనం ఆహ్వానించాలి. కథనచ్చితే బోల్డ్ క్యారెక్టర్ అయినా చేస్తా. ఆసక్తికరంగా ఉంటే చాలు. ఈ మధ్య వచ్చిన `పాతాళ్ లోక్` సిరీస్ నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం మరో వెబ్ సిరీస్తో పాటు గూడచారి-2లో నటిస్తున్నాన`ని మధుశాలిని తెలిపింది.
Latest News