by సూర్య | Wed, Oct 07, 2020, 01:26 PM
కమల్ హాసన్ తనయ శృతి హాసన్ ని పవన్ కల్యాణ్ అభిమానులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సారి పవన్ ఫ్యాన్స్ శృతిని టార్గెట్ చేశారు. అసలేంటి విషయం అంటే..?
శృతి హాసన్ ఇటీవల జాతీయ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో బాలీవుడ్ జనాలను ఆకట్టుకోడానికి ఆమె హిందీ సినిమాల గురించి గొప్పగా చెప్పారు. బాలీవుడ్ మెప్పు కోసం మాట్లాడిన మాటలు ఆమెకు చిక్కులు తెచ్చాయి. దీంతో ఇంత కాలం ఆమెను అభిమానిస్తున్న తమిళ, తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు కోపం వచ్చింది. శృతి హాసన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ అభిమానులు శృతి ని టార్గెట్ చేశారు.
ఆ ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి ప్రస్తావించిన శృతి.. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే తీద్దామని చెప్పే వ్యక్తుల మాటలు తాను విననని అన్నారు. కొన్ని బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించానని, కానీ వాటిని గొప్పగా ఆస్వాదించలేదని కూడా చెప్పారు. ఇంకా ఉత్తమమైన కంటెంట్ను ఎంచుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఆమె కెరీర్లో హిట్లుగా నిలిచిన 'గబ్బర్ సింగ్', 'రేసు గుర్రం' సినిమాల గురించి ఇలా మాట్లాడారని అపార్థం చేసుకుని కొన్ని వెబ్సైట్లు వార్తలు వండి వార్చాయి. దీంతో శృతిపై ట్రోలింగ్ మొదలైంది. గబ్బర్ సింగ్ వంటి సినిమాని అవమానిస్తావా, మా అభిమాన హీరో పవన్ కల్యాణ్ ని కించపరుస్తావా అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ గొడవ చేశారు. దీంతో శృతి వివరణ ఇచ్చుకున్నారు.
"నేను ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటల్ని కొన్ని తెలుగు వెబ్సైట్లు తప్పుగా అర్థం చేసుకున్నాయి. వారు రాసిన వార్తల్లో వాస్తవం లేదు. వాటిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. 'రేసు గుర్రం', 'గబ్బర్ సింగ్' లాంటి సినిమాల్లో నటించడాన్ని ఎప్పటికీ గర్వంగా భావిస్తాను. పవన్ కల్యాణ్ గారితో కలిసి నటించిన 'గబ్బర్ సింగ్' నా జీవితాన్ని మార్చేసింది. తెలుగు, దక్షిణాది చిత్రాల్లో నా భాగస్వామ్యం ఉందంటే.. నేను నా హృదయానికి దగ్గరగా ఉండటమే. నేను నటించిన హిందీ సినిమాలను ఉద్దేశించి ఆ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడా.. అంతేకాని తెలుగు సినిమాల గురించి తక్కువచేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు" అంటూ శృతి వివరణ ఇచ్చుకున్నారు. భారత చిత్ర పరిశ్రమలో 'సౌత్ వర్సెస్ హిందీ' అని మాట్లాడే విషయాలు తనకు ఏ మాత్రం నచ్చవని, ఇప్పుడైనా తనను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు శాంతించారు.
Latest News