by సూర్య | Sat, Aug 06, 2022, 02:13 PM
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, ఆ పార్టీ నుంచి మాధవ్ను సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ మాధవ్ నైతిక బాధ్యత వహించి, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పాలన ధృత రాష్ట్ర పాలనను తలపిస్తున్నదని వివరించారు. జగన్ తన సభలలో మాట్లాడుతూ పదేపదే వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారని, ఆయనను చూసుకునే కొడాలి నానితో పాటు పలువురు వైసీపీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఎక్కువ చెడ్డపనులు చేసే వారికే మంత్రి పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని పల్లా ఎద్దేవా చేశారు. ఏమి చేసినా ఎన్నికలలో ప్రజలను అంగట్లో బొమ్మలులా కొనవచ్చనే ధీమాతో జగన్ ఉన్నారని ఆయన అన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునే మహిళా కమిషన్ సైతం ముఖ్యమంత్రి కనుసన్నలలో నడుస్తున్నదని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి మారితేనే వైసీపీ నాయకులలో మార్పు వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ దక్షిణం నియోజకవర్గం ఇన్చార్జి గండి బాబ్జీ, బీమిలి ఇన్చార్జి కోరాడ రాజబాబు, నజీర్, లొడగల కృష్ణ, ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Latest News