by సూర్య | Sat, Aug 06, 2022, 11:00 AM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజాం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాలను ప్రతి గడపకూ వివరించాలని, పార్టీని మరింతగా పటిష్టం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... రాజాం నియోజకవర్గానికి సంబంధించి కేవలం డీబీటీ కిందే రూ.775 కోట్లు ఇచ్చాం. ప్రతి ఇంటికీ వారివారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేశాం. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో 95శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాం.
ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆశీర్వదించండి అని ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతున్నాం. మంచి చేసిన తర్వాతనే మనం ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడుగుతున్నాం.
రాజాం నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం. దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నాం. వీటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది. ఇలా మంచి చేసిన తర్వాతనే ప్రతి ఇంటికీ వెళ్లి ఆశీస్సులు అడిగే కార్యక్రమాన్ని చేస్తున్నాం అని తెలియజేసారు.
Latest News