by సూర్య | Wed, Jun 22, 2022, 04:55 PM
చంద్రబాబు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. పేద విద్యార్థుల చదువుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు.
ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మంత్రి సురేష్ దుయ్యబట్టారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్’ అంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఇది ప్రభుత్వ విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్ కంటెంట్ కొనాలంటే రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
Latest News