by సూర్య | Wed, Jun 22, 2022, 01:13 AM
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుఓటములు అటుుంచితే బీజేపీని టార్గెట్ చేసేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇదిలావుంటే రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నింటి తరఫున ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో రెండో దఫా భేటీ అయిన విపక్షాలు సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల భేటీకి నేతృత్వం వహించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఓ కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ మద్దతు కూడా యశ్వంత్ సిన్హాకేనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు భేటీలో భాగంగా తాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడానని పవార్ చెప్పారు. సిన్హా అభ్యర్థిత్వానికి తాను మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.
Latest News