by సూర్య | Sat, May 21, 2022, 07:38 PM
సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్రంలోని వివిధ పార్టీల ఆందోళనలతో కాకినాడ దద్దరిల్లింది. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ ను అరెస్ట్ చేయాల్సిందేనని మృతుడి కుటుంబ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలో ఆందోళనను కొనసాగించాయి. మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్ వద్ద ఆందోళనలు కొనసాగాయి. దళిత ప్రజా సంఘాల, సీపీఐ, బీజేపీల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం బంధువులు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు జీజీహెచ్ మార్చురీ వద్ద డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుంటే ఎమ్మెల్సీ కారులో సుబ్రహ్మణ్యం మృతదేహం ఉండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబే తన కారులో తీసుకెళ్లడం, ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబ సభ్యులకు చెప్పి మృతదేహాన్ని అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి వ్యవహారం కాకినాడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. సుబ్రహ్మణ్యం మృతిపై ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం జీజీహెచ్కు వచ్చి.. మార్చురీ గది వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకొని టీడీపీ నేతలు ముందుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గాయపడ్డారు. దీంతో ఆయన్ను జీజీహెచ్లోకి తీసుకెళ్లి వైద్యం అందించారు.
సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఓవైపు ఆందోళనలు జరుగుతున్న తరుణంలో.. శుక్రవారం రాత్రి తునిలో జరిగిన ఓ వివాహా వేడుకకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరుకావడం చర్చనీయాంశమైంది. సీసీ కెమెరాల్లో రికార్డైన ఆ దృశ్యాలు బయటికొచ్చాయి. ఈ క్రమంలో పోలీసుల తీరును ప్రముఖ న్యాయవాది శ్రవణ్కుమార్ తప్పుబట్టారు. ఉదయ్భాస్కర్ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే మరోవైపు సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసే వరకూ తాము సంతకం చేయబోమని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడంతో.. పోస్టుమార్టం నిలిచిపోయింది. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసుపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. పోస్ట్మార్టం జరిగితేనే దర్యాప్తు సాగుతుంది.. కాబట్టి, కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టాలని కోరారు.
Latest News