by సూర్య | Fri, May 13, 2022, 03:42 PM
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తన సభలకు జనం రాక, ఆఖరికి చిన్నపిల్లలతో సభలు పెట్టి, "జై తెలుగుదేశం.. సీఎం బాబు.." అంటూ నినాదాలు చేయించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారాడని కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా చంద్రబాబును నమ్మట్లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చేస్తున్న దిగజారుడు రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏనాడైనా ప్రజలకు మంచి చేసి ఉంటే... ఈ ఖర్మ పట్టేది కాదు కదా.. అని కుప్పం ప్రజలే అనుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం అనగా ఈ రోజు శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన సభల్లో యువతను, విద్యార్థులను రెచ్చగొడుతూ... ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. మీకు పౌరుషం లేదా, మీరు నిద్రపోతారా.. అని యువతను రెచ్చగొడుతూ, మరోవైపు పోలీసులను, అధికారులను బెదిరిస్తూ, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ప్రసంగాలు చేస్తున్నాడు. చంద్రబాబు తీరు ఇలా ఉంటే, ఆయన కొడుకు లోకేష్.. నా మాదిరిగా 12 కేసులు ఉంటేనే.. నా దగ్గరకు రండి, మీరు ఎన్ని అరాచకాలు చేయాలో చేయండి.. నేను చూసుకుంటాను.. అంటూ తెలుగు యువతకు పిలుపునిస్తున్నాడు. దీంతో టీడీపీకి చెందిన వారే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడటం, ఎక్కడ ఏం జరుగుతుందా వాలిపోదాం, ప్రభుత్వంపై బురదజల్లుదాం అని ఎదురుచూసే తండ్రీకొడుకులు సంఘటన జరిగిన ప్రాంతాలకు వెళ్ళి బాధితులను పరామర్శించడం, నిందితులపై కేసులు పెడితే.. మళ్ళీ వీరే కక్ష సాధింపులు అని మీటింగులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం చూస్తుంటే.. ఇటువంటి వింతైన, విచిత్రమైన రాజకీయం ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.
Latest News