by సూర్య | Mon, Jan 17, 2022, 09:15 PM
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత విజయసాయి ప్రకటించారని.. అయితే ఆ తర్వాత గొడ్డలి పోటుతో ఆయన మరణించారని తెలిసిన వెంటనే వైసీపీ నేతలు హత్య చేశారంటూ మాట మార్చారని విమర్శించారు. అసలు వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసని రఘురామ చెప్పారు. సీబీఐ విచారణలో పలువురి పేర్లు బయటకు వచ్చాయని, వీరంతా వైసీపీ నేతలేనని అన్నారు. 'ఏదేమైనప్పటికీ గొడ్డలిపోటును గుండెపోటు అని ఎందుకు చెప్పావ్ విజయసాయిరెడ్డీ?' అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి హత్యను టీడీపీపైకి తోయాలని ప్రయత్నించారో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకాను చంపిన వారు ఎవరో త్వరలోనే వెలుగులోకి వస్తుందని అన్నారు. ఏపీలో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని రఘురాజు అన్నారు. ఈ పరిస్థితుల్లోనే తాను ఢిల్లీకి రావాల్సి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంటే భయపడొద్దని అంటావా? అని మండిపడ్డారు. తనను హత్య చేసేందుకు ప్లాన్ వేశారనే విషయం తెలిసే... ప్రాణ రక్షణ కోసం ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చానని చెప్పారు.
Latest News