by సూర్య | Mon, Jan 17, 2022, 03:51 PM
నెల్లూరు: గత మూడు రోజుల నుండి వాతావరణంలో మార్పులు, బంగాళఖాతంలో అల్ప పీడన ద్రోణితో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక వైపు ఖరీఫ్ సీజన్లో పంట చేతికి వచ్చే సమయంలో అత్యధిక శాతం వర్షాలతో పంట దిగుబడి లేక నష్టపోతే ఈ రబీ సీజన్లో సైతం ఈ అకాల వర్షాలు అన్నదాతలను వదిలిపెట్టడం లేదంటూ చేతికొచ్చే మొక్క జొన్న, వేరుశనగ పంటలు కోతకు, పూతకు రావడంతో వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయలు, ఆకుకూరలకు ఈ అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి పాడయిపోతున్నాయి. మినుము, పెసర రైతుల వేదన వర్ణణాతీతం. అలాగే నిమ్మ చెట్లకు ఇప్పుడిప్పుడే పూతపూస్తోంది. ఈ వర్షానికి పూతరాలిపోతే మంచి సీజన్ లో నిమ్మకాయల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కరోనా 3వ దశ విజృంభిస్తోంది. అకాల వర్షాలకు ప్రజలు జ్వరాలు, దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. ఈ లక్షణాలన్నీ దాదాపు కరోనాకు పోలి ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షంతోపాటు మంచు విపరీతంగా ఉండడం కరోనా వైరస్ కు కలిసొచ్చే వాతావరణం. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఇటు రైతులు అటు సామాన్య ప్రజలకు సైతం కలవరపెడుతున్నాయి.
Latest News