by సూర్య | Mon, Jan 17, 2022, 02:30 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా దాడి చేసి హతమార్చింది. తరచూ మద్యం తాగి వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో విసిగిపోయిన భార్య రోకలి బండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
గిద్దలూరు పట్టణానికి చెందిన అంకాలమ్మ, అంజి అలియాస్ (చిరంజీవి)కి 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం కూడా కలిగింది. మొదట బాగానే ఉన్నా భర్త అంజి తర్వాత తరచూ మద్యం సేవించి అంకాలమ్మ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఆదివారం అర్ధరాత్రి గొడవ ఫుల్లుగా మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఆగ్రహించిన భార్య అంకాలమ్మ చేతికి దొరికిన రోకలిబండతో దాడికి దిగింది.
అనంతరం తీవ్రంగా గాయపడ్డ అంజి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది దీంతో అంజి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తరువాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన అంకాలమ్మ భర్తను హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించింది. దీంతో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Latest News