by సూర్య | Sat, Jan 15, 2022, 08:30 PM
వచ్చే ఎన్నికల్లో నీకు అసలు టికెట్ దక్కుతుందో లేదో తెలుసుకుని అప్పుడు రాజకీయాలు చేస్తే బాగుంటుందని పరిటాల శ్రీరామ్కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హితవు పలికారు. రాప్తాడు నియోజకవర్గంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత రెండున్నరేళ్లలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆస్తులు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన 'సుడిగాడు' చిత్రంలో పెరిగినట్టు తోపుదుర్తి ఆస్తులు పెరిగాయని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే తోపుదుర్తి ఈ రోజు మీడియా ద్వారా పరిటాల శ్రీరాంకు కౌంటర్ ఇచ్చారు. "పరిటాల శ్రీరామ్... ఒక జూనియర్ ఆర్టిస్ట్" అంటూ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నీకు టిక్కెట్ ఇస్తారో లేదో తేల్చుకుని అప్పుడు రాజకీయాలు చేస్తే బాగుంటుంది అని ఎద్దేవా చేశారు. "ఆ రాజకీయాలు కూడా నా వద్దే చూపు... ధర్మవరం కేతిరెడ్డి వద్ద చూపావంటే కష్టమే. ఆయన నా అంత మంచోడు కాదు" అని హితవు పలికారు. "ఎవరివి అక్రమ ఆస్తులో అందరికీ తెలుసు. మీ నాన్న బీడీ కట్ట, హవాయి చెప్పులతో బతుకు ప్రారంభించాడు. మా తండ్రి పుట్టుకతోనే శ్రీమంతుడు. మా వాళ్లకు 200 ఎకరాల భూమి ఉండేది. మా డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేశాం. మీలాగా అవినీతి కార్యకలాపాలతో సంపాదించలేదు. భూస్వాములపై పరిటాల కుటుంబీకులు నిజంగా పోరాడి ఉంటే వారికి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?" అని తోపుదుర్తి ప్రశ్నించారు. పరిటాల శ్రీరామ్ చెబుతున్న భూమి రాప్తాడు నియోజకవర్గం పరిధిలోకే రాదని, అసలు అక్కడ తమకు భూమే లేదని స్పష్టం చేశారు.
Latest News