by సూర్య | Sat, Jan 15, 2022, 05:16 PM
పార్టీని నమ్ముకొని ప్రాణాలు పొగొట్టుకొన్న నేతలను ఆదుకొనేందుకు వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకునేందుకు టీడీపీ నాయకులు కర్నూలు జిల్లాలో శ్రీకారం చుట్టారు. హత్యకు గురైన కుటుంబాలకు రాష్ట్రంలోని ఏ కార్యకర్త అయినా ఫోన్ పే ద్వారా చేతనైనంత సాయం చేయాలని కోరారు. మొదట ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుటుంబానికి కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్ పే ద్వారా ఆర్థికసాయం చేశారు. ప్యాపిలి మండలం బాపనపల్లిలో హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబానికి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు యాదవ్ ఫోన్ పే చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సోమిశెట్టి.. ఇకపై ఎక్కడ టీడీపీ కార్యకర్త హత్యకు గురైనా వారి కుటుంబాన్ని వేలాది మంది టీడీపీ క్యాడర్ ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్సార్సీపీ వర్గీయుల చేతిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఫోన్ పే ద్వారా నేరుగా వెంటనే తోచినంత సహాయం అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని ఏ కార్యకర్త అయినా ఫోన్ పే ద్వారా చేతనైనంత సాయం చేయాలని పిలుపునిచ్చిన సోమిశెట్టి.. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామన్నారు. ఫోన్ పే సాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Latest News