by సూర్య | Fri, Jan 14, 2022, 03:31 PM
భర్త కొన్నేళ్లుగా వేరే మహిళతో ఎఫైర్ కొనసాగిస్తుండడంతో భార్య వద్దని వారించింది. మాట వినకపోవడంతో తన భర్తతో పాటు ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేయబోయాడు. ఆపేందుకు వచ్చిన వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్య బంధువు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగింది.
వింజమూరు గ్రామానికి చెందిన నవ్యభారతి, అబ్దుల్ బాషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆత్మకూరు మండలం కరటంపాడు సచివాలయంలో పనిచేస్తున్న బాషా అక్కడే పనిచేస్తున్న రషీదాతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంపై పలుమార్లు నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన నవ్యభారతి సచివాలయానికి వెళ్లి రషీదాతో గొడవపడింది. తన భర్త బాషాపై కేసుపెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న బాషా, బంధువుల ఇంట్లో ఉన్న నవ్యభారతిపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డుకోబోయిన నవ్యభారతి బంధువు నరేశ్, అతని స్నేహితులు ముఖేశ్, నాయబ్పైనా దాడి చేశాడు. ఈ దాడిలో నరేష్ కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్కు 3 నెలల క్రితమే వివాహం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Latest News