by సూర్య | Fri, Jan 14, 2022, 12:26 PM
రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి కరోనా టీకా తీసుకోవడంతో లేచి కూర్చున్నాడు. అంతే కాదు ఇన్నాళ్లు మూగబోయిన ఆయన గొంతులో మాటలు రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. జార్ఖండ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోకారో జిల్లా ఉతాసారా పంచాయతీ పరిధిలోని సల్గాడీహ్ గ్రామానికి చెందిన దులార్చంద్ ముండా (55) అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని మంచంపై నుంచి కదలలేని పరిస్థితి వచ్చింది. మాట కూడా పడిపోయింది. అయితే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జనవరి 4వ తేదీన అతడికి వైద్య సిబ్బంది కొవిషీల్డ్ మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఆ మరుసటి రోజు అనూహ్యంగా ఆయన లేచి నిలబడ్డాడు. అంతే కాదు మాటలు కూడా వచ్చాయి. ఇన్నాళ్లు మంచానికే పరిమితమైన వ్యక్తి టక్కున లేచి నిలబడటం తో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ టీమ్ను కూడా ఏర్పాటు చేసింది.
Latest News