by సూర్య | Fri, Jan 14, 2022, 12:10 PM
'సంక్రాంతి' వచ్చిందంటే చాలు..తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటాయి. తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు 'భోగి' పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వేడుక వైభవంగా జరుగుతోంది.
సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాం ... తెల్లవారుజామున లేచి అప్పటికే ఆవు పేడతో చేసిన ఇదిగో ఈ ఫొటోలో ఉన్న పిడకలు భోగి మంటగా వేసి జరుపుకుంటాం.
మరి భోగి మంట ఎందుకు వేస్తారు అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కొంతమందికి గూగుల్ లో ఫొటోస్ కి ఉండే క్వటేషన్స్ అంటే ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాం అనేట్టు అంత వరకే తెలుసు
మరి ఆ భోగి విశేషం ఏమిటో ఇప్పుడు చూద్దాం
భోగి రోజున రాబోయే తెల్లవారుజామున సూర్యుడు సంపూర్ణంగా ఉత్తరాయణనికి రాబోతున్నాడని తెలపటానికే పెద్ద అగ్ని రాశిని చలిమంట రూపంలో భోగి మంటగా వేసి చూపిస్తారు.
లౌకికంగా ఈ చలి(భోగి)మంటలో ఇంట్లో ఉండే పనికిరాని వాటిని ఆ మంటలో వేస్తాం... అలా వేయడం వలన వ్యర్ధపదార్ధాలన్నీ దీనిలోనికి వెళ్ళిపోతాయి... ఈ మంటలకి ఆకర్షించబడి మంచుకి చేరిన ఎన్నో క్రిములు, కీటకాలు కూడా మంటలో పడి మరణించి మనకి రోగాల్ని కలిగించనీయవు. ఇక ఇక్కడ నుంచి క్రమక్రమంగా వాతావరణంలో చలిని తగ్గించి ఉష్ణోగ్రత పెరుగుతూపోతుందని చెప్పడం కూడా భోగిమంట వేయటంలోని రహస్యం ... అలాగే పితృదేవతలు ఊర్ధ్వ లోకాలు చేరుకోవటానికి మార్గం చూపించే దివ్యకాంతే ఈ భోగిమంటలు అని కూడా అంటారు.
మరి ఆవుపేడతో ఎందుకు పిడకలు చేస్తారు అంటే ... ఆవు పిడకలని మంటగా వేసేటప్పుడు వచ్చే పొగతో మనిషికి శ్వాస సంబంధిత వ్యాధులేమైనా ఉంటే తొలగిపోతాయని, అలానే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంటారు. అందుకే భోగిమంట చల్లారిన తరవాత పిడకల బూడిదని విభూధిగా రాసుకుంటారు.
పండగా అంటే ఎదో జరిపేసుకుంటున్నాం అనుకుకోకుండా అసలు ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుంటే మనకి ఒక సంతృప్తి ఉంటుంది., అలాగే దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది అని భావనతో సాంప్రదాయాలను మరింత గౌరవిస్తాం, ఆచరిస్తాం, కాపాడుకుంటాం.
Latest News