by సూర్య | Thu, Jan 13, 2022, 02:26 PM
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ను కేంద్రం నియమించింది. సోమనాథ్ 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు రెండున్నరేళ్లపాటు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గానూ సోమనాథ్ పనిచేశారు. ‘‘ఈ ముఖ్యమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తాను’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘భారత అంతరిక్ష సంస్థను నిర్వర్తించడం అత్యంత ముఖ్యమైన బాధ్యత.. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, ఇస్రో, IN-SPAce, స్టార్టప్లతో సహా భాగస్వాములంతా అంతరిక్ష కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విస్తరించే ప్రయత్నాలలో ఉన్నారు’’ అని అన్నారు.
‘‘దేశంలో అంతరిక్ష సంస్థను విస్తరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో అంతరిక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మరో లక్ష్యం. తగిన చట్టం, ఫ్రేమ్వర్క్, మార్గదర్శకాల ద్వారా ఇది జరుగుతుంది’’ అని సోమనాథ్ పేర్కొన్నారు.
కేరళకు చెందిన సోమనాథ్.. కొల్లంలోని టీఎంకే కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1985లో వీఎస్ఎస్సీలో చేరిన సోమనాథ్.. తొలి నాళ్లలో పీఎస్ఎల్వీ విభాగంలో టీమ్ లీడర్గా పనిచేశారు. రాకెట్ ఇంజనీరింగ్, లాంచింగ్ వెహికిల్స్ డిజైనింగ్లో నిపుణుడిగా పేరొందారు.
Latest News