by సూర్య | Thu, Jan 13, 2022, 12:32 PM
గుంటూరు: మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో తెదేపా గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు గుండ్లపాడు వెళ్లనున్నారు. హత్య ఘటనపై స్పందిస్తూ.. వైకాపా అరాచక పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
సీఎం జగన్ దారుణ పాలనపై తిరగబడుతున్న తెదేపా క్యాడర్ను, ప్రజలను భయపెట్టేందుకే వైకాపా హత్యాకాండ సాగిస్తుందని దుయ్యబట్టారు. ఒక్క పల్నాడులోనే ఇప్పటివరకు పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన తెదేపా నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు.
ఆనాడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే వైకాపా బరితెగింపునకు అడ్డుకట్ట పడేదని పేర్కొన్నారు. దాడులు చేసిన వారికి పదవులు కట్టబెట్టి విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని మండిపడ్డారు. హత్యకు గురైన చంద్రయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Latest News