by సూర్య | Thu, Jan 13, 2022, 11:49 AM
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో పాల్గొంటున్న ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు కరోనా సోకింది. మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ తో సహా ఏడుగురు షట్లర్లు కరోనా బారినపడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారని చెప్పింది. కరోనా సోకిన వారిలో అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్ మంజునాథ్, సిమ్రన్ అమాన్ సింఘీ, కుషి గుప్తా ఉన్నారు. మరోవైపు వీరు డబుల్స్ పార్ట్నర్స్ సైతం టోర్నీ నుంచి వైదొలిగారని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
వైరస్ సోకిన వారికి బదులుగా వేరేవారిని తీసుకొనే ప్రసక్తి లేదని చెప్పింది. దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్ చేస్తామని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Latest News