by సూర్య | Wed, Jan 12, 2022, 10:02 PM
కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఏకంగా జైలుకు పంపి నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఒక్క కేసు ఉండకూడదనే లక్ష్యంతో జియాంగ్, యోంగ్జూ నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నట్టు అక్కడ జనం ఆరోపణలు చేస్తున్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా చైనా కఠినమైన లాక్డౌన్ను కొనసాగిస్తోంది. జీరో వైరస్ కంట్రీగా మార్చేందుకు ఆంక్షలను అమలు చేస్తోంది. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోతే శిక్షిస్తోంది. కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు చైనా ప్రభుత్వం ముగ్గురు వ్యక్తులకు నాలుగేళ్లకుపైగా జైలు శిక్ష వేసింది. బీజింగ్లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న డాలియన్ ఓడరేవుకు చెందిన ఒక కార్గో సంస్థలో పనిచేసే సిబ్బంది మాస్క్లు ధరించలేదు. మాస్క్లు వేసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగారు. దాంతో 83 మందికి వైరస్ సోకింది. ఇది 2020లో నవంబర్లో జరిగింది. ఆ టైంలో డాలియన్, బీజింగ్, లియానింగ్లో పెద్ద ఎత్తున వైరస్ కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారించిన అధికారులు సిబ్బంది మాస్క్లు ధరించకపోవడాన్ని సంస్థ పట్టించుకోలేదని పేర్కొని ఆ సంస్థపై భారీ జరిమానా విధించారు. అంతేకాదు సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధులకు 39 నుంచి 57 నెలల వరకు జైలు శిక్ష వేశారు.
Latest News