by సూర్య | Wed, Jan 12, 2022, 04:10 PM
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు వరుసగా రెండు రోజులు 5 శాతం దాటింది. కొత్త కేసులతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ సదుపాయాలను మరింతగా మెరుగుపర్చాలని సూచించింది. ఆరోగ్య సేవలు, ఆసుపత్రులలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతను నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలు విస్తృత పర్చాలని సూచించారు. ఆరోగ్య సేవల్లో కనీసం 48 గంటల పాటు తగినంత పరిమాణంలో మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తన లేఖలో తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ నిర్వహణపై కూడా శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఈ ప్లాంట్ల పనితీరు, తగినంత ఆక్సిజన్ గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
Latest News