by సూర్య | Wed, Jan 12, 2022, 01:02 PM
భార్యాభర్తల మధ్య తలెత్తిన కలతలు వారి పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేసింది. అప్పటి వరకు హాయిగా, సాఫీగా సాగిన వారి జీవితాలు అందకారంలోకి వెళ్లాయి. భర్త తీసుకున్న నిర్ణయం తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విఘ్నేశ్వరన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ మహిళతో పెళ్లైంది. పెళ్లయిన కొన్నాళ్లు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమో కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదు. దీంతో భార్య తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మనస్తాపంలో ఉన్న విఘ్నేశ్వరన్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. విరుధచలం సమీపంలోని పువనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య పట్టాలపై విగత జీవిలా పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. భర్తకు దూరంగా ఉన్నాననుకుంది కానీ చివరకు ఆ భర్తే లేకుండా పోవడంతో ఆమె రోదించిన తీరు అందరిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Latest News