by సూర్య | Tue, Jan 11, 2022, 06:08 PM
వైసీపీ నేతలు మేకవన్నె పులులు అని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. అయితే వీళ్లు రాష్ట్రంలోనే పులులు అని, ఢిల్లీలో మాత్రం పిల్లులు అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఒక గల్లీ పార్టీ అని విష్ణు వ్యాఖ్యానించారు. బీజేపీ వంటి పార్టీని ఏమీ చేయలేరన్న విషయాన్ని వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రహించాలని పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ నేత శ్రీకాంత్ పై దాడి జరగడం పట్ల విష్ణు పైవిధంగా స్పందించారు. ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చర్యలు ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ కాస్తా ఆఫ్ఘనిస్థాన్ లా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు తాలిబన్లను తలపిస్తున్నారని విమర్శించారు. ఆత్మకూరులో పోలీస్ స్టేషన్ పైనా దాడి జరిగిందని, పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి గానీ మాట్లాడారా? అని నిలదీశారు. ఆత్మకూరు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్న వాళ్లు ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, హఫీజ్ ఖాన్ లను ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
Latest News