by సూర్య | Tue, Jan 11, 2022, 04:30 PM
కృష్ణా జిల్లా: అతడికి భార్య లేదు. ఇద్దరూ విడిపోయి చాలా కాలమైంది. ఆమెకు భర్త లేడు. ఆమె కూడా సింగిల్ గా ఉండటం మొదలుపెట్టి ఏళ్లు గడుస్తోంది. ఇద్దరికీ సినిమా స్టైల్లో ఓ ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. చివరకు హత్యాయత్నం వరకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెంకు చెందిన నారపోగు ఏసురాజు తన భార్యతో విడిపోయాడు. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా తెలంగాణలోని వరంగల్ కు చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏసురాజు ఆమె కోసం తరచూ వరంగల్ కు వెళ్లి వస్తుండేవాడు. ఇద్దరి మధ్య వ్యవహారం బాగా ముదిరింది.
ఈ క్రమంలో ఓ రోజు ఆమెకు ఫోన్ చేసిన ఏసురాజు సుబ్బాయిగూడెం రావాలని చెప్పాడు. దీంతో ఆమె వచ్చింది. ఇద్దరూ భోజనం చేసి పడుకున్న తర్వాత ఉన్నట్లుండి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ప్రియురాలిపై ఆవేశంతో ఊగిపోయిన ఏసురాజు బ్రేడుతో ఆమె గొంతుకోసి, తాను కూడా చేయి కోసుకొని అత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ చిన్నగాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఐతే ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రియురాలు ముందుకు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
Latest News